సాధు సాంగత్యమే శరణ్యము (రెండవ భాగము)

Articles by Satyanarayana DasaComments Off on సాధు సాంగత్యమే శరణ్యము (రెండవ భాగము)

గురువుకొరకు అన్వేషణ

       ఒకరోజు ఒక షాపింగ్ మాల్ లో పాత పుస్తకాల అమ్మకం చూసాను. శ్రీల ప్రభుపాదుల వారి “ఈజీ జర్నీ టు అథర్ ప్లానెట్స్” అను పుస్తకం తీసుకున్నాను. ఈ చిన్న పుస్తకాన్ని వెంటనే చదివాను, మరియు అది చాలా ఆసక్తికరంగా అనిపించింది. కానీ రచయితకు ఇస్కాన్ కు మధ్య సంబంధం గ్రహించలేదు. గురించి ఉంటే, శ్రీల ప్రభుపాదుల వారి రచన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది గనుక, నా మనసు మార్చుకుని ఆలయానికి తిరిగి వెళ్ళేవాడిని. 

    ఒక సంవత్సరం తర్వాత మా సంస్థ ప్రధాన కార్యాలయమున్న డెట్రాయిట్ అనే నగరానికి నన్ను బదిలీ చేసారు. కలకత్తానుండి వచ్చిన  ఒక ధార్మిక కుటుంబానికి చెందిన ఐఐటి ఖరగ్‌పూర్‌లో చదివిన  భారతీయ స్నేహితుడితో కలిసి అక్కడ నివసించాను. నా హృదయంలోని భావనలను బహిరంగంగా మాట్లాడటం నా జీవితంలో ఇదే మొదటిసారి. నాకు మయామిలో కొంతమంది భారతీయ స్నేహితులు ఉండేవారు, కాని వారితో ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొనలేదు. ఇంట్లో ఉంటున్న స్నేహితుడు ఆధ్యాత్మికంగా చాలా మొగ్గు చూపడం ఆనందకరమైన ఆశ్చర్యం కలిగించింది. మేము చాలా మంచి స్నేహితులయ్యాము, కొద్దిపాటి జ్ఞానమే  ఉన్నప్పటికీ, మా గదిలో ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విషయాలను చర్చించేవాళ్ళం. దగ్గరలో ఉన్న మున్సిపల్ గ్రంథాలయానికి వెళ్లి హిందూమతం, యోగము, ఆధ్యాత్మికత మొదలగు అంశాల పుస్తకాలు తెచ్చుకునేవాళ్లం. క్రమంగా మా ఉద్యోగాలు వదిలేసి భారతదేశానికి తిరిగొచ్చి గురువు కోసం వెతుకుదామని ప్రణాళిక వేసుకున్నాము. ప్రతిరోజూ రాత్రి మంచం మీద పడుకొని హిమాలయాల్లో ఆత్మతత్త్వమెరిగిన గురువుకోసం వెతుకుతున్నట్లు కలలు కనే వాడిని. ఇదే సమయంలో యోగ పుస్తకంలో ఉపవాసము వలన ఇంద్రియ నిగ్రహం వస్తుందని చెప్పడం వల్ల అది ఆత్మ సాక్షాత్కారానికి మొదటి మెట్టు కనుక శని ఆది వారాల్లో ఉపవాసం ఉండటం మొదలుపెట్టాము. 

      మయామిలో ఉన్నప్పుడు చాలామంది నా పాత తరగతి స్నేహితులతో, విద్యాలయ విద్యార్థులతో సంబంధం ఉండేది. కానీ, వారంతా భౌతిక సుఖాల మీద ఆసక్తి చూపడం వల్ల వారితో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడడం జరగదు కనుక అది ఒక గందరగోళమని భావించాను. నేను డెట్రాయిట్‌కు వెళ్ళిన తర్వాత, నేను వారిలో ఎవరినీ సంప్రదించలేదు. 

శ్రీ రాధా కృష్ణులు డెట్రాయిట్లో

డెట్రాయిట్ ఇస్కాన్ దేవాలయం

        ఒకసారి మిచిగన్ రాజధాని లాన్సింగ్‌కు ఐఐటి ఢిల్లీకి చెందిన నా సీనియర్ సహఉద్యోగి ఒకరు నన్ను ఆహ్వానించారు. ఆయన మంచి పెద్దమనిషి, నా స్నేహితులకు పెద్ద వార్త అయిన నా ఆధ్యాత్మిక ఆసక్తి గురించి విన్నాడు. డెట్రాయిట్ నగరం మధ్యలో ఒక అందమైన రాధా కృష్ణుల గుడి ఉందని, అక్కడ ఆరతి, ప్రవచనము మరియు ప్రసాదము ప్రతి ఆదివారం ఉంటాయని చెప్పాడు. డెట్రాయిట్ కు వచ్చాక ఆ దేవాలయం ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడికి ఎలా చేరుకోవాలో కనుక్కున్నాను. నేను నా సహనివాసి శని ఆది వారములు ఉపవాసము చేసేవారముగనుక గుడిలో ప్రసాదంతో ఉపవాస పారణ చేయవచ్చని నేను అనుకున్నాను. అప్పట్లో మాకు వండుకోవడం పెద్దగా ఇష్టముండేది కాదు.

           అక్కడికి వెళ్ళకముందు అది ఇస్కాన్ దేవాలయమని నాకు తెలియదు. గతానుభవంప్రకారం తెలిసుంటే వెళ్ళేవాడినికాదు. అక్కడికి చేరుకోగానే ఆ వాతావరణం, దేవతా ప్రతిమలు మరియు ప్రసాదం చూడగానే నన్ను ఆకట్టుకున్నాయి. అక్కడి భక్తులు నాతో ప్రవర్తించిన తీరు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది కానీ ఎక్కువమంది భారతీయ భక్తులు ఉండడంవల్ల మయామి ఇస్కాన్ గుడితో పోలిస్తే చాలా మేలనిపించింది. ఒక భారతీయ భక్తుడు “బ్యాక్ టు గాడ్హెడ్” పత్రిక ఇచ్చాడు. అప్పట్లో శ్రీల ప్రభుపాద లీలామృతము(జీవితచరిత్ర) ఇంకా ప్రచురించబడలేదు కానీ కొంత భాగం ఈ పత్రికలో  వస్తూండేది. రెండవ ఖండము, “ఒంటరి పోరాటం” లోని అధ్యాయములు ప్రచురించేవారు. ఇది నా మనస్సును బాగా ఆకట్టుకుంది. న్యూయార్కులో బౌరీ ప్రాంతంలో ప్రభుపాదులవారు పడిన కష్టాలను తెలియజేసింది. ఆయన అంకితభావం మరియు పశ్చిమ దేశాలలో భక్తిని వ్యాప్తి చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. క్రమంగా గుడికి వెళ్తూ ఉండేవాడిని అక్కడ భక్తులు నాకు ఉపదేశిస్తూ ఉండేవారు, ఇది వాళ్ళ కర్తవ్యమని తర్వాత నాకు తెలిసింది. వారితో తరచూ నాకు వాదన జరిగేది, కొన్నాళ్ల తర్వాత నాకు ఉపదేశించడం వారు మానేశారు. ఆ గుడి అధ్యక్షుడు నా విశ్వవిద్యాలయంలో చదువుకున్నవాడని, అతనే అక్కడున్న బ్రహ్మచారులకు నాకు ఉపదేశించడం ఆపేయమని చెప్పాడని, తనే స్వయంగా నాతో మాట్లాడతాడని తర్వాత తెలిసింది.

ప్రభుపాద మూర్తి డెట్రాయిట్లో

ప్రభుపాదులవారి వంటి గురువు

        గుడి అధ్యక్షుడు నన్ను నా సహనివాసిని కలిసి చక్కగా మాట్లాడేవాడు. ప్రభుపాదులవారి శిష్యుడిగా ఆయన అనుభూతులు మాతో పంచుకునేవాడు. ప్రభుపాదులవారి జీవితచరిత్ర చదివాక నేనూ ఆయన శిష్యుడిగా అవ్వాలని అనుకున్నాను, కానీ ఆయన పరమపదించారని తర్వాత తెలుసుకున్నాను. భారతదేశానికి వెళ్లి ఆయన సహాధ్యాయులను కలవాలనుకున్నాను. ప్రభుపాదులవారు, ఆయన గురువుగారు గొప్పవారైతే, ఆయన గురువుగారైన భక్తిసింద్ధాంతగారికి అంతే గొప్ప ఇతర శిష్యులు ఉంటారని, వారిలో ఎవరినోఒకరిని నా గురువుగా స్వీకరిద్దామని అనుకున్నాను.

       ఒక రోజు భారతదేశానికి తిరిగెళ్లి ప్రభుపాదులవారి సహాధ్యాయులను కలవాలనే నా ప్రణాళిక స్నేహితుడితో చర్చిస్తున్నప్పుడు అతను నన్ను “ప్రభుపాదులవారిమీది నీకు నమ్మకముందా?” అని అడిగాడు. “అవును, లేకపోతే ఆయన సహాధ్యాయులను ఎందుకు వెతుకుతాను?” అని చెప్పాను. “ప్రభుపాదులవారు ఉత్తమ భక్తుడని నమ్ముతున్నావా?” అని మళ్ళీ అడిగాడు. అవునని ఖచ్చితంగా చెప్పాను. దానికి అతను “ఉత్తమ భక్తుడు పారంగతుడు.  అతనికి అన్నీ తెలుసు. ప్రభుపాదులవారు ఉత్తమ భక్తుడు మరియు ఆయన తన పదకొండు మంది శిష్యులను గురువులుగా నియమించారు, కావున నువ్వు వారిలో ఒకరివద్ద దీక్ష తీసుకోవాలి.” అని చెప్పాడు. తన వాదన నాకు నమ్మదగినదిగా అనిపించి అలా 1980లో డెట్రాయిట్లో ఇస్కాన్లో చేరాను. 

శ్రీల జీవ గోస్వామి

సందర్భములను అధ్యయనం చేయాలనే తపన

    ప్రభుపాదుల వారి గ్రంథాల ద్వారా ఆయన చాలా గొప్ప తత్త్వవేత్తగా భావించే శ్రీ జీవ గోస్వాముల వారి షడ్-సందర్భముల గురించి తెలిసింది. వీటిని అధ్యయనం చేయాలని నాలో ఒక తీవ్ర కోరిక కలిగింది. అది ఎలా సాధ్యమో తెలియలేదు కానీ అమెరికాలో మాత్రం అది సాధ్యం కాదని, భారతదేశానికి తిరిగి రావాలని తెలుసుకున్నాను. అంతేకాక, ఇస్కాన్‌లోని భక్తులు బిబిటి ప్రచురణలు తప్ప వేరేవి చదవడం ప్రోత్సహించబడేది కాదు. ఈలోగా, నా సొంత ప్రయత్నంతో సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఏదో ఒకరోజు భారతదేశానికి వెళ్లి సందర్భములను చదవగలగడానికి సరిపోయే సంస్కృతం నేర్చుకోవచ్చని అనుకున్నాను. కానీ భారతదేశానికి తిరిగి రావడం గురించి భక్తులు ఎప్పుడూ ప్రతికూలంగా మాట్లాడేవారు మరియు భారతీయ ఇస్కాన్ దేవాలయాలలో ఎటువంటి సేవ చేయలేమని చెప్పారు. ఇక్కడ డెట్రాయిట్ గుడిలో ముఖ్యమైన సేవ వదిలి ఇదంతా చేయడం వ్యర్థమౌతుందని చెప్పారు. అందుకని వెంటనే భారతదేశానికి వెళ్లే ప్రయత్నం మానేసాను.

అదే సమయంలో మా కుటుంబం నుంచి వారు నా గురించి చాలా దిగులుతో ఉన్నారని తెలిసింది. ముఖ్యంగా మా అమ్మ నన్ను తలుచుకొని ఏడ్చేది. భారతదేశంలో సాధువు ఇంటింటికి తిరిగి బిక్షాటన చేసినట్లు నేను కూడా సాధువుగా మారినందుకు అమెరికాలో బిక్షాటన చేస్తున్నానని అనుకొంది. భారతదేశానికి వస్తే ఏదో ఒక గుడిలో ఉండచ్చని భిక్షాటనకు తిరగాల్సిన అవసరం ఉండదని అనుకుంది. మా అమ్మ బెంగపడడం వల్ల మరియు ఇస్కాన్ లో నాకు దీక్ష ఇచ్చిన గురువు పరమపదించడం వల్ల నా పరిస్థితి మారడంతో  1983లో భారతదేశానికి రావడానికి నిశ్చయించుకొని నా కుటుంబాన్ని సందర్శించాను, నా తల్లిని ఓదార్చాను, తరువాత మాయపూర్ మరియు బృందావన్ దేవాలయాలను సందర్శించాను. 

     బృందావన్ ఇస్కాన్ దేవాలయంలో ఉందామనుకున్నాను కానీ ఇక్కడికి కేవలం రెండు గంటల దూరంలో మా కుటుంబం ఉంటుంది కనుక అది సరియైన ఆలోచనగా నాకు అనిపించలేదు. అందుకే తిరుపతి ఇస్కాన్లో సేవ చేద్దామనుకున్నాను, అక్కడే ఒక ఆచార్యుని వద్ద సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టాను. బృందావనానికి వెళ్లాలని కలలు కంటుండేవాడిని. 

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    మీ మార్గాన్ని ఇతరులకు తెలియజేయడానికి ఉత్తమ మార్గం శాంతియుతంగా, ప్రశాంతంగా మరియు ఇతరులను అంగీకరించే మీ వ్యక్తిగత ప్రవర్తన. ఇది వారిలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.